ఎస్సారెస్పీ నుంచి నిరంతరంగా సాగునీటి విడుదల చేయాలి -గ్రామీణ పేదల సంఘం డిమాండ్
ఎస్సారెస్పీ నుంచి నిరంతరంగా సాగునీటి విడుదల చేయాలి -గ్రామీణ పేదల సంఘం డిమాండ్
Vikram
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
ఎస్సారెస్పీ నుంచి సాగునీటిని వారాబంది పద్ధతి లేకుండా నిరంతరంగా విడుదల చేయాలని గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఈ యాదగిరికి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య మాట్లాడుతూ, గత సంవత్సరం వారాబంది పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని చెప్పడంతో రైతులు వరి నాట్లు వేసుకున్నారని తెలిపారు. అయితే చివరి భూములకు నీళ్లు అందక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. ఆ సమయంలో అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జనవరి నెలలో వారాబంది పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని ప్రకటించడంతో రైతులు వరి నాట్లు వేసుకున్నారని, అయితే మొదటి దఫా విడుదల చేసిన నీళ్లు కూడా చివరి భూములకు అందకపోగా, కాలువల్లో కూడా పూర్తిస్థాయిలో ప్రవహించలేదని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి చివరి భూములకు నీళ్లు అందేలా స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని, లేదా కనీసం చెరువులు, కుంటలు నింపేలా చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామీణ పేదల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య, ఓపీడీఆర్ జిల్లా కార్యదర్శి సుంకరి రమేష్ బాబు, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్, అనంతుల యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి