ఎంగేజ్మెంట్ తరువాత వరుడు పెళ్లికి నిరాకరణ… మనస్తాపంతో తల్లి-కుమార్తె బలవన్మరణం
ఎంగేజ్మెంట్ తరువాత వరుడు పెళ్లికి నిరాకరణ… మనస్తాపంతో తల్లి-కుమార్తె బలవన్మరణం
GADDAM JAGANMOHAN REDDY
బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వరుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి-కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత (46) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె దివ్య (25) ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా కుమార్తె దివ్య గత మూడు సంవత్సరాలుగా హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది.
మార్టూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శేషుబాబుతో పెద్దలు వివాహం నిశ్చయించి గత సంవత్సరం డిసెంబర్ 14న నిశ్చితార్థం జరిపారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా ఈ నెల 4వ తేదీన వరుడు శేషుబాబు దివ్యతో పాటు ఆమె తల్లిదండ్రులను మార్టూరులోని తన నివాసానికి పిలిపించాడు. అక్కడ తాను హైదరాబాదులో దివ్యను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు చూపించి పెళ్లికి నిరాకరిస్తున్నట్లు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి సుజాత, కుమార్తె దివ్య అదే రోజు మార్టూరులో ఎలుకల మందు, గడ్డి మందు కొనుగోలు చేసి స్వగ్రామమైన ద్రోణాదుల చేరుకుని వాటిని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మరుసటి రోజు సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన శ్రీనివాసరావు తొలుత చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించి అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం చేర్పించారు.
గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న సుజాత, దివ్యల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో దివ్య మృతి చెందగా, ఉదయం 10 గంటల ప్రాంతంలో తల్లి సుజాత కూడా ఆసుపత్రిలోనే కన్నుమూశారు.
ఈ ఘటనపై భర్త శ్రీనివాసరావు గుంటూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి మార్టూరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ విషాద ఘటన ద్రోణాదుల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి