విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
Biksham
స్థానికం ప్రతినిధి
విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదివి ఆ లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం శ్రమించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భాను నాయక్ పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని జీవివి గార్డెన్స్లో నిర్వహించిన శ్రీ లక్ష్మీ వెంకట సాయి వృత్తి విద్య జూనియర్ కళాశాల ఏడవ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఇంటర్మీడియట్ విద్య ప్రతి విద్యార్థి జీవితాన్ని కీలక మలుపు తిప్పే దశ అని పేర్కొన్న భాను నాయక్, ఈ సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదివి జీవితంలో రాణించి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు. పరీక్షల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో సమయాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించి కళాశాలకూ, తల్లిదండ్రులకూ గౌరవం తీసుకురావాలని హితవు పలికారు.కళాశాల కరస్పాండెంట్ కారింగుల బాలా గౌడ్ మాట్లాడుతూ, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా తమ కళాశాలలో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు. తమ కళాశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడినట్లు గుర్తు చేశారు. వృత్తి విద్య కోర్సులు చేసిన విద్యార్థులు ఏ రంగంలోనైనా, ఎక్కడైనా రాణించగలరని, పూర్వ విద్యార్థుల విజయాలే ఇందుకు నిదర్శనమని అన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని వారి పిల్లలను అభివృద్ధి పథంలో నడిపించాలనే సదాశయంతో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కే వంశవర్ధిని ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ విభాగంలో 988 మార్కులు, కారింగుల సౌజన్య ఎమ్మెల్టీ ద్వితీయ సంవత్సరం విభాగంలో 981 మార్కులు, జి హాసిని ఎంపీహెచ్ ఫిమేల్ డబ్ల్యు ప్రథమ సంవత్సరం విభాగంలో 494 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటగా, ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున మొత్తం ముప్పై వేల రూపాయల నగదు బహుమతిని డిఐఈఓ భాను నాయక్ చేతుల మీదుగా అందజేశారు.వేడుకలకు ముందు విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కారింగుల విజయలక్ష్మి, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి