విద్యా హక్కు చట్టం అమలులో ప్రభుత్వం విఫలం
విద్యా హక్కు చట్టం అమలులో ప్రభుత్వం విఫలం
Biksham
ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్ తప్పనిసరి: వట్టే జానయ్య యాదవ్
విద్యా హక్కు చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చినప్పటికీ, రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలో ఉండి కూడా సమర్థంగా అమలు చేయకపోవడం విచారకరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ విమర్శించారు.
గురువారం సూర్యాపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని విద్యా హక్కు చట్టం స్పష్టంగా పేర్కొంటుందని అన్నారు. ఆర్థిక స్థితి ఎలా ఉన్నా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ఈ చట్టం లక్ష్యమని తెలిపారు.
అనేక ప్రైవేట్ పాఠశాలలు ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని, ఫలితంగా పేద విద్యార్థులు అధిక ఫీజుల భారం మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో సుమారు 75 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని గుర్తించామని, అవి అధిక ఫీజులు వసూలు చేస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సహించబోదని హెచ్చరించారు.
పేద విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో చట్టబద్ధ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొన్ని పాఠశాలలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థి విభాగం తల్లిదండ్రులకు అండగా నిలిచి విద్యార్థుల హక్కుల కోసం కృషి చేస్తుందని తెలిపారు.
సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, మహిళా ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మామిడి శోభన్, యువజన అధ్యక్షుడు కోలా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి