ఏడు వారాల జాతరలో ఐదోవ ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూజలు
ఏడు వారాల జాతరలో ఐదోవ ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూజలు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధి బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు వారాల జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదోవ ఆదివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించగా, తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ అర్చకులు సిద్దు స్వామి, నాగేష్ స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో మహాభిషేకం చేసి ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు–కుంకుమ తిలకం దిద్ది పట్టువస్త్రాలు సమర్పించి సుగంధ పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. హారతులు సమర్పించి నైవేద్యాలు నివేదించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఏడు వారాల జాతరలో ఐదోవ ఆదివారం ప్రత్యేక ప్రాధాన్యం కలిగినదని, జిల్లాలో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటిగా గుర్తింపు పొందిందని తెలిపారు. భక్తితో మొక్కులు పెట్టిన వారి కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి