దివ్యాంగులకు అండగా నిలవడం అభినందనీయం
దివ్యాంగులకు అండగా నిలవడం అభినందనీయం
K.RAVI
సివియర్ డిసబిలిటీ వెల్ఫేర్ సొసైటీ వార్షికోత్సవంలో సీఐ మన్మధ కుమార్
తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు సమాజం అండగా నిలవాలని, వారికి సేవ చేయడం అభినందనీయమని స్థానిక సీఐ మన్మధ కుమార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని జయశ్రీ ఫంక్షన్ హాల్లో గురువారం సివియర్ డిసబిలిటీ వెల్ఫేర్ సొసైటీ యాదాద్రి జిల్లా 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన 'గౌరీశ ఫౌండేషన్' నిర్వాహకులు కర్నాటి అనిల్-స్వప్న దంపతుల ఆర్థిక సాయంతో.. చౌటుప్పల్ పరిసర ప్రాంతాలకు చెందిన కండరాల క్షీణత, వెన్నుముక తీవ్ర వైకల్యం కలిగిన 45 మంది బాధితులకు రూ.2వేల విలువైన నిత్యవసర సరుకులను సీఐ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఇంతటి మంచి సేవా కార్యక్రమంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. పోలీస్ శాఖ తరఫున ఎల్లప్పుడూ దివ్యాంగులకు సహాయ సహకారాలు అందిస్తామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సొసైటీ అధ్యక్షుడు బాలకృష్ణ కత్తుల మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా తోటి బాధితులకు సేవ చేయడం తన బాధ్యతను పెంచిందని, దాతల సహకారం మరవలేనిదని పేర్కొన్నారు. దివ్యాంగులను కించపరిస్తే సెక్షన్ 92 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు.
అనంతరం దాతలు సమకూర్చిన అన్నదాన కార్యక్రమంలో దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మాతృశ్రీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పి.యాదయ్య, ప్రతిభ ఒకేషనల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ప్రకాష్, తండ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి