ధాన్యం కొనుగోళ్లలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ధాన్యం కొనుగోళ్లలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి
Krishna
రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, నిర్ణీత సమయంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ అధికారులు, పౌరసరఫరాల అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో డాటా నమోదు, ట్రక్ షీట్ తయారీ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తగా పనిచేయాలని సూచిస్తూ, 24 గంటల్లోగా పురోగతి కనిపించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కొన్ని రైస్ మిల్లుల వద్ద లారీలు నిలిచిపోతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, వెంటనే లారీలను ఖాళీ చేసి ధాన్యాన్ని దిగుమతి చేయాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా మిల్లుల వద్ద తహసీల్దార్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని తెలిపారు. కొంతమంది మిల్లర్లు సహకరించడం లేదని సమాచారం ఉందని, ప్రతి మిల్లులో ఎంత ధాన్యం దిగుమతి చేశారన్న వివరాలను సేకరించి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హమాలీల సమస్యలు ఉన్నచోట వెంటనే పరిష్కరించాలని సూచించారు.పోలీసులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పరస్పర సమన్వయంతో పనిచేసి ధాన్యం రవాణా, లారీల కదలికలు, దిగుమతి ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతిరోజూ మండలాల వారీగా ట్యాబ్ నమోదు, ట్రక్ షీట్ వివరాలను సిద్ధం చేసి పర్యవేక్షించాలని పౌరసరఫరాల అధికారులకు సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 5 లక్షల 32 వేల 655 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. 5 వేల 573 మంది రైతుల ఖాతాల్లో రూ.89 కోట్ల 85 లక్షలు జమ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి బాల సరోజ వెల్లడించారు. అలాగే రైతుల ధాన్యం రక్షణ కోసం 3 వేల 520 టార్పాలిన్ కవర్లు పంపిణీ చేసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంగీత, నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమా హారతి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి