దేశాభివృద్ధికి 2027 జనాభా లెక్కలు కీలకం
దేశాభివృద్ధికి 2027 జనాభా లెక్కలు కీలకం
Biksham Goud
బాధ్యతగా పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్ లాల్ పవార్
దేశ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు జనాభా లెక్కలు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. అధికారులు పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలో జనాభా గణన–2027ను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
జనాభా గణన రెండు దశల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహాల గణన మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించనున్నారని చెప్పారు. రెండో దశలో జనాభా గణన 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 1, 2027ను ప్రామాణిక తేదీగా పరిగణించనున్నట్లు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణన ద్వారా లభించే గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
ఈసారి జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొబైల్ అనువర్తనాలు, వెబ్ వేదికల ద్వారా గణన ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక ఆన్లైన్ వేదికను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
మొదటి దశలో నిర్వహించే ఇళ్ల జాబితా, గృహాల గణనలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన పదార్థాలు, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగు నీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంట గది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 34 ప్రశ్నలపై ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు.అనంతరం శిక్షణ నిర్వాహకులు, జిల్లా ప్రణాళిక అధికారి కిషన్ నాయక్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని తెలిపారు. తరువాత జనాభా గణాంక అధికారులు యువేందర్ బాబు, రవీంద్ర నాయక్ ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి, గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలి అనే అంశాలపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ రెవెన్యూ విభాగాధికారులు వేణు మాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసు, ప్రధాన శిక్షకుడు రమేష్, మండల అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి