దరిపల్లి అనంతరాములు సేవలు చిరస్మరణీయం. వాత్సల్య ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా 5వ వర్ధంతి
దరిపల్లి అనంతరాములు సేవలు చిరస్మరణీయం. వాత్సల్య ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా 5వ వర్ధంతి
Editor Desk
భువనగిరి: వాత్సల్య ఇంజినీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు స్వర్గీయ దరిపల్లి అనంతరాములు 5వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం వాత్సల్య ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ దరిపల్లి నవీన్కుమార్, డాక్టర్ దరిపల్లి కిరణ్కుమార్, దరిపల్లి ప్రవీణ్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దరిపల్లి అనంతరాములు విద్యావేత్తగా, సమాజ సేవకుడిగా, ఉద్యమకారుడిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో అనేక విద్యాసంస్థలను స్థాపించి వేలాది మంది యువత భవిష్యత్తును తీర్చిదిద్దారని పేర్కొన్నారు.
భువనగిరిలో కృషి ఐటీఐ, శ్రీ సాయి కృప జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు, వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లుంబిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తదితర విద్యాసంస్థలను స్థాపించి విద్యా రంగానికి విశేష సేవలందించారని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా విద్యాసంస్థలను ఏర్పాటు చేసి సాంకేతిక విద్యకు కొత్త దారులు తీశారని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ కళాశాలల జేఏసీ చైర్మన్గా ఉద్యమానికి మద్దతుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం, కుమ్మరుల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని తెలిపారు.
వర్ధంతి సందర్భంగా రాయగిరిలోని సహృదయ అనాథాశ్రమంలో వస్త్రాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరాములు సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దరిపల్లి కుటుంబ సభ్యులు, వాత్సల్య గ్రూప్ అధ్యాపకులు, పూర్వ అధ్యాపకులు, బీసీ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుమ్మర కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి