చిన్నారుల భద్రతకు ముందడుగు – ప్రత్యేక బాల ఆరోగ్య పరీక్షలకు శ్రీకారం
చిన్నారుల భద్రతకు ముందడుగు – ప్రత్యేక బాల ఆరోగ్య పరీక్షలకు శ్రీకారం
Krishna
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “బాలల భద్రత–మాదకద్రవ్య రహిత తెలంగాణ” వారోత్సవాల సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలోని ప్రత్యేక బాల ఆరోగ్య కేంద్రంలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల ఆరోగ్య ప్రమాదాల గుర్తింపు పరీక్షలను జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు, వైద్యులు డాక్టర్ శశాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు, ఎదుగుదల లోపాలు, అభివృద్ధి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటా సర్వే నిర్వహించి ప్రమాదంలో ఉన్న పిల్లలను గుర్తించి ఆసుపత్రికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అలాంటి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ప్రత్యేక వైద్య సేవలు, ఇతర వైద్య కేంద్రాలకు పంపించే సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. చిన్న వయస్సులోనే సమస్యలను గుర్తిస్తే వారిని సాధారణ స్థితికి తీసుకురావడం సులభమవుతుందని పేర్కొన్నారు. డాక్టర్ శశాంక్ మాట్లాడుతూ ప్రమాదంలో ఉన్న పిల్లలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత శస్త్రచికిత్సలు, వ్యాయామ చికిత్స, ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డాక్టర్ వసంతరావు మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో ఆరోగ్య సమస్యలు గుర్తించకపోతే భవిష్యత్తులో తీవ్రమయ్యే అవకాశముందని, అందుకే ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది ద్వారా గుర్తించి ప్రత్యేక బాల ఆరోగ్య కేంద్రానికి తరలించి సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి, జోగిపేట, సదాశివపేట తదితర ప్రాంతాల నుంచి 24 మంది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీఓ రత్నం, పోషణ అభియాన్ సమన్వయకర్త నవీన్ చారి, సిబ్బంది లింగం, యాదగిరి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి