చేనేత సమస్యల పరిష్కారానికి మార్చి 25న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా
చేనేత సమస్యల పరిష్కారానికి మార్చి 25న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా
Editor Desk
చేనేత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మార్చి 25న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం ఉపేందర్ పిలుపునిచ్చారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పోస్టర్, కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వనం ఉపేందర్ మాట్లాడుతూ.. చేనేత రంగానికి సంబంధించిన పలు సంక్షేమ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించడం వల్ల పరిశ్రమకు భారీ దెబ్బ తగిలిందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్న రుణమాఫీ అమలు చేసినప్పటికీ, ఇతర పథకాల అమలులో నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. త్రిఫ్ట్ పథకంలో కార్మికులు డిపాజిట్ చేసిన మొత్తాలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించలేదని, జియోట్యాగ్ ఉన్న కార్మికులకు భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
చేనేత కార్మికులకు నెలకు భరోసా భృతి, ఆరోగ్య బీమా, గృహ నిర్మాణ సదుపాయాలు కల్పించాలని, సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే చేనేత వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసి, కార్మికులకు ఉపాధి కల్పించాలని సూచించారు.
ఈనెల 25న జరిగే మహాధర్నాకు భువనగిరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్లంకి గ్రామ నాయకులు పున్న దత్తాద్రి, ఈపూరి సత్యనారాయణ, అంకం నరసింహ, అంకం మురళి, పున్న రాఘవేంద్ర, గుర్రం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి