చౌటుప్పల్లో బీసీ వసతి గృహాన్ని పునఃప్రారంభించాలి
చౌటుప్పల్లో బీసీ వసతి గృహాన్ని పునఃప్రారంభించాలి
K.RAVI
అధికారులు మొండి నిద్ర వీడాలి
వసతి లేక పేద విద్యార్థులు చదువుకు దూరం
ఇన్ఛార్జ్ ఆర్డీఓకు ఎస్ఎఫ్ఐ వినతిపత్రం
నిర్లక్ష్యం వీడకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం
చౌటుప్పల్ కేంద్రంలో గతంలో ఉండి, ప్రస్తుతం మూతపడిన బీసీ విద్యార్థుల వసతి గృహాన్ని (హాస్టల్) తక్షణమే పునఃప్రారంభించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇన్ఛార్జ్ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలో గతంలో ఉన్న బీసీ హాస్టల్ను మూసివేయడం వల్ల వందలాది మంది పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా.. హాస్టల్ పునరుద్ధరణపై అధికారులు కనీస శ్రద్ధ చూపకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. అధికారులు తమ మొండి నిద్రను వీడి తక్షణమే వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
హాస్టల్ లేక బాల కార్మికులుగా మారుతున్న వైనం..
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బడుగు, బలహీన వర్గాల పేద విద్యార్థులకు చౌటుప్పల్లో వసతి సౌకర్యం లేకపోవడంతో చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు, పేద విద్యార్థులు హాస్టల్ లేకపోవడం వల్ల చదువు మానేసి బాల కార్మికులుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చౌటుప్పల్లో బీసీ హాస్టల్ ఏర్పాటు చేస్తే ఇలాంటి ఎంతోమంది పేద విద్యార్థులకు ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్య వైఖరిని వీడకుండా చౌటుప్పల్లో బీసీ హాస్టల్ను పునఃప్రారంభించకపోతే, విద్యార్థులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ నేతలు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు శీను, శివ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి