చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద భారీ గంజాయి పట్టివేత
చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద భారీ గంజాయి పట్టివేత
స్థానికం బృందం
నలుగురు అరెస్ట్ – 60.685 కేజీల ఎండు గంజాయి స్వాధీనం
రామన్నపేట: ఒడిశా రాష్ట్రంలోని భరంపూర్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 60.685 కేజీల ఎండు గంజాయిని ఎక్సైజ్ అధికారులు చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద మంగళవారం పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేశారు.
బుధవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ. శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు టోల్ ప్లాజా వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఆటోను తనిఖీ చేయగా గంజాయి బయటపడినట్లు తెలిపారు.
మహిళలపై అనుమానం రాకుండా ఉండేందుకు వారిని ఉపయోగించి రవాణా చేయిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అక్రమంగా మత్తుపదార్థాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టుబడిన నిందితుల్లో ముగ్గురు మహారాష్ట్రకు చెందిన గంగాబాయి పాండురంగ్ చౌహాన్, కమల్ మోహితే, విజయ్ ఆసారం గోరపడే కాగా, మరొకరు నల్లగొండ జిల్లా వాసి వల్లపు దాసు వేణుకుమార్గా గుర్తించారు.
రామన్నపేట, మోత్కూర్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు ఆర్. బాళోజి నాయక్, కె. రవిచంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిందితులను అరెస్ట్ చేసి బుధవారం రామన్నపేట కోర్టులో హాజరుపరిచారు.
ఈ ఆపరేషన్లో ఎస్ఐలు ఎన్. శంకర్, బి. శివకృష్ణ, పి. సత్యనారాయణతో పాటు కానిస్టేబుళ్లు తిరుమలేష్, రావోజీ, అనిల్, కృష్ణారెడ్డి, గోపీనాథ్ రెడ్డి, వెంకట్, రహమాన్, రమేష్ రెడ్డి, సోనీ, స్వప్న పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి