చాట్రాయి దీప చెరువులో యువకుడు మృతి.. మిస్టరీగా మారిన ఘటన
చాట్రాయి దీప చెరువులో యువకుడు మృతి.. మిస్టరీగా మారిన ఘటన
GADDAM JAGANMOHAN REDDY
హత్య చేశారంటూ కుటుంబ సభ్యుల ధర్నా
విచారణ చేసి న్యాయం చేస్తాం: ఎస్ఐ రామకృష్ణ
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చాట్రాయి గ్రామ దీప చెరువులో యువకుడు మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. చాట్రాయి గ్రామానికి చెందిన అంబటి అనుదీప్ (19) చెరువులో పడి మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మృతుడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు గురువారం మధ్యాహ్నం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన కొందరు యువకులు అనుదీప్ను చెరువులోకి తోసి హత్య చేశారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
మృతుడు పోలవరం గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడని, దీనిపై ఆ యువతి తండ్రి మరియు అతని బంధువులు కలిసి పథకం ప్రకారం చెరువులోకి తోసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా యువతి తండ్రి తమ ఇంటికి వచ్చి “మా అమ్మాయితో మీ అబ్బాయి మాట్లాడితే చంపేస్తాం” అంటూ బెదిరించాడని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం కూడా తమ ఇంటికి వచ్చారని, అనంతరం ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు.
సాయంత్రం 6 గంటల సమయంలో చెరువు వద్ద మృతుడి ఫోన్ ఉండగా, గంటలోపే అది పోలవరం గ్రామంలోని యువతి తల్లిదండ్రుల వద్దకు చేరిందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్ డేటా, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ మందపాటి బసవారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చాట్రాయి ఎస్ఐ రామకృష్ణను కోరారు.
విచారణ చేపట్టాం: ఎస్ఐ
మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చాట్రాయి ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి విచారణ చేపట్టి దోషులను వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి