భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన పండరీపూర్ మహా పాదయాత్ర
భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన పండరీపూర్ మహా పాదయాత్ర
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని రామ మందిరం నుంచి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న పండరీపూర్ మహా పాదయాత్రను ఈ ఏడాది కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక సంప్రదాయం భక్తులలో విశేష ఆదరణ పొందుతూ, ప్రతి సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించబడుతోంది.ఈ పాదయాత్రను తొలిసారిగా కీ.శే. రాజు కుమార్ శెట్కార్ ఆధ్వర్యంలో ప్రారంభించగా, ప్రస్తుతం ఆయన కుమారుడు, మాజీ సర్పంచ్ అప్పారావు శెట్కార్ నాయకత్వంలో సక్రమంగా నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యాలు, భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పాదయాత్ర సజావుగా సాగేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ మహా పాదయాత్రకు అంతర్గావ్ పీఠాధిపతి శ్రీ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందిస్తున్నారు.ఆయన ఆశీస్సులతో నారాయణఖేడ్ నియోజకవర్గంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొని మహారాష్ట్రలోని పండరీపూర్ చేరుకుని పాండురంగ స్వామివారి దర్శనం చేసుకునే పవిత్ర సంప్రదాయం కొనసాగుతోంది.బుధవారం ఖేడ్ పట్టణం నుంచి ఈ మహా పాదయాత్రను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,
నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు కే. శ్రీనివాస్ పాల్గొని భక్తులను ఉత్సాహపరిచారు.భక్తులు భజనలు,కీర్తనలు,నామస్మరణలతో పాదయాత్రను ప్రారంభించగా పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.పాదయాత్రలో భాగంగా మార్గమధ్యంలో ఉన్న హుక్రాన పాండురంగ మందిరం వద్ద ప్రత్యేక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ధర్మం, భక్తి, మానవ విలువలపై చేసిన ఆధ్యాత్మిక సందేశాలను శ్రద్ధగా విన్నారు. ఈ ప్రవచనాలు భక్తులకు ఆత్మీయ ఆనందాన్ని, ఆధ్యాత్మిక ప్రేరణను కలిగించాయి.ఈ పండరీపూర్ మహా పాదయాత్ర భక్తుల హర్షాతిరేకాలు, జయజయ ధ్వనులు, భజనలు, నామస్మరణలతో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో సాగుతూ, ప్రతి ఒక్కరిలో భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి