బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు కల్పించాలి. – రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు కల్పించాలి. – రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
Editor Desk
మోత్కూరు,: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లపై అమలు చేస్తున్న క్రిమిలేయర్ నిబంధనను వెంటనే ఎత్తివేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. మోత్కూరులో నిర్వహించిన బీసీ ఉద్యోగుల బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెడతామని తెలిపారు. ఈ విషయంలో చట్టపరమైన, రాజ్యాంగపరమైన, న్యాయపరమైన ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. మండల్ కమిషన్తో పాటు నాచియప్పన్ పార్లమెంటరీ కమిటీ కూడా బీసీలకు ప్రమోషన్ రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రమోషన్ రిజర్వేషన్లు కల్పించవచ్చని తీర్పు ఇచ్చిందన్నారు.
విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లలో బీసీలకే క్రిమిలేయర్ నిబంధన విధించడం వివక్షకు నిదర్శనమని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులు, ఎన్సీసీ వంటి ఇతర రిజర్వేషన్ వర్గాలకు లేని నిబంధన బీసీలకే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. రిజర్వేషన్ల లక్ష్యం కేవలం ఆర్థికాభివృద్ధి కాదని, పాలనలో భాగస్వామ్యం కల్పించడం, సామాజిక హోదా పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, పారిశ్రామిక రంగంలో 50 శాతం కోటా ఇవ్వాలని కోరారు. అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, ముత్యం వెంకన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాం దేవ్ యాదవ్, యాదగిరి, కళాబృందం రామలింగం, డప్పు స్వామి, కలిమల నరసింహ, ఎడ్ల మహాలింగం, నరేష్ ముదిరాజ్, అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి