కక్ష సాధింపు చర్యలంటూ కార్పొరేటర్ దాసరి సాయికుమార్ ఆరోపణ.
ఇళ్ల వరకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు.. పోలీసులకు ఫిర్యాదు.
నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ కార్పొరేటర్లపై దాడులకు కుట్ర జరుగుతోందని కార్పొరేటర్ దాసరి సాయికుమార్ ఆరోపించారు. రాజకీయ అసహనంతో కొందరు కాంగ్రెస్ నాయకులు గత రెండు రోజులుగా బీజేపీ కార్పొరేటర్ల ఇళ్ల వద్దకు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదన్నారు.
బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సాయికుమార్ మాట్లాడుతూ.. బీజేపీ ఎదుగుదలను, కార్పొరేటర్లు ప్రజలతో మమేకమై పనిచేయడాన్ని జీర్ణించుకోలేక కొందరు కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 48వ డివిజన్లో అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించినందుకే తన ఇంటిపై దాడికి యత్నించారని ఆరోపించారు. ప్రజల ఆస్తులను కాపాడాలని, అభివృద్ధి నిధులను దుబారా చేయవద్దని ప్రశ్నించినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
‘తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’
ఎన్ని దాడులు చేసినా ప్రజల పక్షాన నిలబడతామని సాయికుమార్ స్పష్టం చేశారు. తనపై దాడికి యత్నించిన వారిపై నల్లగొండ రెండో టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడికి నిరసనగా తాము ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేపట్టామని తెలిపారు. అయితే వ్యక్తిగత కక్షతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి తల్లి ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. మహిళ అని కూడా చూడకుండా ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులను కోరారు.
సమావేశంలో అక్కేపల్లి బలరాం, దుర్గ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి