బస్ భవన్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు
బస్ భవన్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు
Prabhakar
ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం పని చేసిన ధీరుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ ఘన నివాళి.
అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబుజీ చేసిన కృషి చిరస్మరణీయం : టీజీఎస్ ఆర్టీసీ ఈడీ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) సిహెచ్.వెంకన్న.
భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని టీజీఎస్ఆర్టీసీ ఘనంగా నివాళులర్పించింది.
సంస్థ ప్రధాన కార్యాలయం బస్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈడీ సిహెచ్. వెంకన్న, అధికారులు మరియు సిబ్బంది బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఈడీ సిహెచ్. వెంకన్న మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆజన్మాంతం శ్రమించిన ధీశాలి బాబూ జగ్జీవన్ రామ్ అని, సామాజిక సమానత్వానికి ఆయనే పునాది వేశారని కొనియాడారు.
ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాబుజీ, నాటి కాలంలో ఉన్న అస్పృశ్యత మరియు వివక్ష వంటి సామాజిక రుగ్మతలను విద్యార్థి దశ నుంచే ధైర్యంగా ఎదుర్కొని జన చైతన్యం తెచ్చిన గొప్ప సంస్కర్త అని వారు గుర్తుచేశారు. కేవలం నిరసన తెలపడమే కాకుండా, అధికారంలోకి వచ్చి వ్యవస్థను మార్చాలని నమ్మిన ఆయన, ఐదు దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్ గా చట్టసభల్లో తన ముద్ర వేశారని వెంకన్న పేర్కొన్నారు.
దేశాభివృద్ధి అంటే కేవలం భవనాలు నిర్మించడం కాదు, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సమాన గౌరవం అవకాశం లభించడమేనని నమ్మిన బాబుజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ఎందరికో ఆదర్శంగా నిలిచాయని, ఆ మహనీయుడి స్ఫూర్తితోనే టీజీఎస్ఆర్టీసీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తోందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయపుష్ప, టీజీఎస్ఆర్టీసీ సీటీఎం (ఏం&సి ) శ్రీధర్, సీసీఈ కవిత, పలువురు సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ స్మృతికి అంజలి ఘటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి