బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి సాగునీరు: మంత్రి కోమటిరెడ్డి
బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి సాగునీరు: మంత్రి కోమటిరెడ్డి
ఎడిటోరియల్ టీమ్
నల్లగొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
శనివారం నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రాజెక్టు కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి, రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండపాకగూడెం నుంచి అప్పాజీపేట వరకు నిర్మించనున్న పిల్లకాలువ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు కాలువల ద్వారా నియోజకవర్గంలోని చెరువులన్నింటిని నింపి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరుగుతుందని అన్నారు.
నల్లగొండ నియోజకవర్గం తనకు గుండెకాయలాంటిదని, అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడం తన లక్ష్యమని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
అప్పాజీపేట గ్రామంలో పిల్లకాలువ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో అశోక్ రెడ్డి, సర్పంచ్ గంగుల అండాలు సైదులు, ఇరిగేషన్ అధికారులు సతీష్ చంద్ర, పిచ్చయ్య, నవీన్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి