బాలల భద్రత వారోత్సవాల్లో భాగంగా దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన అధికారులు
బాలల భద్రత వారోత్సవాల్లో భాగంగా దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన అధికారులు
Krishna
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “బాలల భద్రత – మాదకద్రవ్య రహిత తెలంగాణ” వారోత్సవాల సందర్భంగా గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో దత్తత సహాయ కేంద్రాన్ని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డాక్టర్ చక్రపాణి, బాలల సంక్షేమ సంఘం సభ్యుడు వెంకటేశం ప్రారంభించారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు చట్టబద్ధమైన దత్తతపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మహిళా ప్రాంగణంలో నిర్వహించిన దత్తత మరియు సంరక్షణ కుటుంబాలపై అవగాహన కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ చట్టబద్ధ దత్తత ద్వారా పిల్లలకు కుటుంబ వాతావరణం, మంచి భవిష్యత్తు లభిస్తుందని, తల్లిదండ్రులకు కూడా పిల్లలతో కుటుంబ బంధాలు ఏర్పడతాయని వివరించారు. దత్తతకు ఇచ్చే ప్రతి శిశువుకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తరువాతే దత్తత ప్రక్రియ చేపడతామని, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను ప్రత్యేక విభాగంలో దత్తతకు అందజేస్తామని తెలిపారు. అలాగే తాత్కాలిక దత్తత, సంరక్షణ కుటుంబాల విధానం, దత్తతకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ, ఆన్లైన్ దరఖాస్తు విధానం, మిషన్ వాత్సల్య పోర్టల్ వినియోగం, శిశు గృహాల్లో పిల్లలకు అందిస్తున్న సంరక్షణ సేవల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు, బాలల పరిరక్షణ విభాగ సిబ్బంది, బాలల సహాయవాణి ప్రతినిధులు, సఖి సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి