బడ్జెట్లో వికలాంగుల పట్ల నిర్లక్ష్యం – NPRD ఆగ్రహం
బడ్జెట్లో వికలాంగుల పట్ల నిర్లక్ష్యం – NPRD ఆగ్రహం
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వినాయక చౌరస్తా వద్ద బడ్జెట్ పత్రాలను దగ్ధం చేస్తూ వికలాంగుల సంక్షేమానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు ప్రకాష్, వనం ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3,24,234 కోట్ల బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కనీసం 5 శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ, ఆ దిశగా చర్యలు కనిపించడం లేదన్నారు.
గత బడ్జెట్తో పోలిస్తే కూడా వికలాంగుల సంక్షేమ శాఖకు కేటాయింపుల్లో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు కేటాయించిన నిధుల్లో వికలాంగులకు ఎంత భాగం ఉందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
చేయూత పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా, అర్హులైన అందరికీ పెన్షన్లు అందడం లేదని తెలిపారు. బాలభరోసా వంటి పథకాలకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
అదేవిధంగా వికలాంగులకు సహాయ పరికరాలు, ప్రభుత్వ కార్యాలయాల అనుకూలీకరణ, ప్రత్యేక విద్యాభివృద్ధి, మోటారైజ్డ్ వాహనాలు, వివాహ ప్రోత్సాహకాలు, స్వయం సహాయక సంఘాల ఏర్పాటు వంటి అంశాల్లో కూడా నిధుల కేటాయింపులు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, బోనగిరి మండల నాయకులు పాండాల శ్రీహరి, ఎండి సలాం, గోపి, దండబోయిన గణేష్, రాసాల నవీన్, కృష్ణయ్య, ఉద్దామర్రి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి