బడ్జెట్లో జర్నలిస్టులకు మొండి చెయ్యి
బడ్జెట్లో జర్నలిస్టులకు మొండి చెయ్యి
Biksham Goud
జర్నలిస్టుల పట్ల వివక్ష తగదు: మామిడి సోమయ్య
హైదరాబాద్,
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమానికి ఎటువంటి నిధులు కేటాయించకుండా మొండి చెయ్యి చూపిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆయన విమర్శించారు. జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపై ఎటువంటి ప్రస్తావన లేకపోవడం అన్యాయమన్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరించిందని, సమాచార పౌర సంబంధాల శాఖను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. చిన్న, మధ్యతర పత్రికలకు ఇవ్వాల్సిన ప్రకటన బిల్లులు కూడా చెల్లించకపోవడం బాధాకరమన్నారు. మీడియా అకాడమీ గురించి కూడా బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదని తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు, ఇతర పథకాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, నిధులు లేకుండా ఈ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చిన తరువాత జర్నలిస్టులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, కొత్త గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయం పెంచాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని గత రెండేళ్లుగా కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఈ బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, మీడియాపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం సహించరానిదని అన్నారు. వెంటనే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి