ఆస్తి రాసిచ్చిన తండ్రిని వేధించిన కొడుకులు… చిన్నకోడూరు పోలీసుల కేసు నమోదు
ఆస్తి రాసిచ్చిన తండ్రిని వేధించిన కొడుకులు… చిన్నకోడూరు పోలీసుల కేసు నమోదు
GADDAM JAGANMOHAN REDDY
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో వృద్ధాప్యంలో ఉన్న కన్నతండ్రిని వేధిస్తున్న ఇద్దరు కొడుకులపై చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
గ్రామానికి చెందిన కొండి నారాయణరెడ్డి (94)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు రాజిరెడ్డి సిద్దిపేటలో వ్యాపారం చేస్తుండగా, చిన్న కుమారుడు పరమేశ్వర్ రెడ్డి గంగాపూర్లో వ్యవసాయం చేస్తున్నాడు. నారాయణరెడ్డి తనకు ఉన్న 7 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు సమానంగా చెరి 3½ ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. వయస్సు పైబడటంతో తమను చూసుకుంటారని ఆశించి ఆస్తిని కుమారులకు అప్పగించినప్పటికీ, వారు మాట మార్చినట్లు బాధితుడు వాపోయారు.
ఆస్తి రాసిచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఒక పాత ఇంట్లో ఉంచి కనీస సౌకర్యాలు కల్పించకుండా వేధిస్తున్నారని, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని నారాయణరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నిస్తే బూతులు తిడుతూ, చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు.
విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ మానవత్వంతో స్పందించారు. వృద్ధుడు పోలీస్ స్టేషన్కు రాలేని పరిస్థితిలో ఉండటంతో అధికారులే నేరుగా ఆయన నివాసానికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించారు. వృద్ధులను వేధించడం చట్టరీత్యా నేరమని పేర్కొంటూ, బాధ్యులైన ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ శ్రీను తెలిపారు.
అలాగే వృద్ధులపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి