ఆరవ ఆదివారం వేడుకల్లో భక్తజన సంద్రంగా మారిన బోరంచ నల్లపోచమ్మ జాతర
ఆరవ ఆదివారం వేడుకల్లో భక్తజన సంద్రంగా మారిన బోరంచ నల్లపోచమ్మ జాతర
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధి బోరంచ గ్రామ శివారులో స్వయంగా వెలసిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు వారాల జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆరవ ఆదివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించగా, తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు ఎక్స్ ఆఫీస్ మెంబర్ శ్రీకాంత్ స్వామి, నాగేష్ స్వామి,ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో మహాభిషేకం నిర్వహించి ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం పసుపు, కుంకుమ తిలకం దిద్ది పట్టువస్త్రాలు సమర్పించి సుగంధ పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. మహామంగళహారతులు సమర్పించి నైవేద్యాలు నివేదించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు జాతరకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆరవ ఆదివారం జాతరలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉండటంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లాలో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో భక్తితో మొక్కులు పెట్టిన వారి కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి