ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు..
గతంలో 16 కేసుల్లో నిందితులుగా గుర్తింపు..
పోలీసు యంత్రాంగాన్ని అభినందించిన ఎస్పీ..
నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల జేబుదొంగల ముఠాను నల్గొండ టూటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, ఒక ఆటోరిక్షా, రూ.3,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్కు చెందిన సిరిగిరి కవిత (36), బొంతల నాగమణి (28)తో పాటు యాదాద్రి-భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం డాకు తండాకు చెందిన వాంకుడోత్ ప్రసాద్ (31) ఉన్నారు. నిందితుల్లో కవిత, నాగమణి అక్కాచెల్లెళ్లు కాగా.. ప్రసాద్, నాగమణికి భర్త. ఈ ముగ్గురూ ఒక ముఠాగా ఏర్పడి ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణికుల్లా నటిస్తూ పిక్పాకెటింగ్కు పాల్పడేవారు. ప్రయాణికుల దృష్టి మళ్లించి సెల్ఫోన్లు, నగదు కాజేయడం వీరి నైజం. విచారణలో వీరిపై గతంలో పటాన్చెరు, జీడిమెట్ల, ఎల్బీనగర్, హయత్నగర్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 16 కేసులు ఉన్నట్లు తేలింది. గతంలో చంచల్గూడ జైలుకు కూడా వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 12న మధ్యాహ్నం నల్గొండ బస్టాండ్లో బస్సు ఎక్కుతున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.3,800 నగదును ఈ ముఠా చోరీ చేసింది. తిరిగి గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మళ్లీ దొంగతనానికి యత్నిస్తుండగా, పక్కా సమాచారంతో నల్గొండ టూటౌన్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, టూటౌన్ సీఐ కే. ఆది రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు డి. సైదాబాబు, జి. మానస, ఏఎస్ఐ ఎం. ఉమారాణి, హెచ్సీ డి. విజయకుమారి, సిబ్బంది రాధిక, బాలకోటి, షకీల్లు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి