అర్హులందరికీ జాబ్ కార్డులు అందించాలి : జిల్లా కలెక్టర్ ఆదేశాలు
అర్హులందరికీ జాబ్ కార్డులు అందించాలి : జిల్లా కలెక్టర్ ఆదేశాలు
Krishna
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాని కిషోర్, సెర్ప్ సీఈవో దివ్య అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కలిసి ఎన్ఆర్ఇజీఎస్, మహిళా స్వయం సహాయక సంఘాలు, చేయూత పథకం, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి కూలీల సంఖ్య పెంచడంతో పాటు అర్హులైన వారికి కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని సూచించారు. కూలీలు పూర్తి స్థాయిలో పని దినాలను వినియోగించుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూడీఐడీ కార్డులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చూడాలని, మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కూలీలు ఉదయం 7 గంటలలోపు పని ప్రదేశాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాలు, పాఠశాలల మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో సబ్ కలెక్టర్ ఉమా హారతి, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీఆర్డీఓ జ్యోతి, అడిషనల్ పీడీలు సూర్యారావు, బాల్రాజ్, ఎంపీడీవోలు, ఏపీఎంలు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి