అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే
అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే
Biksham
సమానత్వ సమాజమే ఆయనకు నిజమైన నివాళి – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నగరం: అజ్ఞానపు చీకట్లను చీల్చి అణగారిన వర్గాల జీవితాల్లో అక్షర కాంతిని నింపిన మహానీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు.
శనివారం నగరంలోని శ్రీశ్రీ వృత్తం వద్ద వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటి సమాజంలో వేళ్లూనుకున్న కుల వివక్షను, అంటరానితనాన్ని ధైర్యంగా ఎదిరించిన ధీశాలి పూలే అని ప్రశంసించారు. “విద్య ప్రతి ఒక్కరి హక్కు” అని చాటిచెప్పి, తన భార్య సావిత్రిబాయి పూలేను తొలి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది స్త్రీ విద్యకు పునాదులు వేశారని గుర్తుచేశారు.
సమాజంలో సమూల మార్పుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమానత్వ సమాజ నిర్మాణమే మహాత్మ జ్యోతిరావు పూలేకు నిజమైన నివాళి అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సామాజిక న్యాయం ప్రతి ఇంటికీ చేరేలా కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, అభివృద్ధి అధికారి జ్యోతి, విభాగ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి