ఐక్యత, త్యాగానికి ప్రతీక బక్రీద్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఐక్యత, త్యాగానికి ప్రతీక బక్రీద్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Editor Desk
త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక బక్రీద్ పండుగ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లింల ప్రార్థనల అనంతరం ఆయన పాల్గొని బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) శుభాకాంక్షలు తెలిపారు.
ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం త్యాగం, విశ్వాసం, మానవతా విలువలను స్మరించుకుంటూ జరుపుకునే ఈ పండుగ సమాజంలో ఐక్యత, సహనం, పరస్పర ప్రేమాభిమానాలకు ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. బక్రీద్ ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసి జీవించడం రాష్ట్ర ప్రత్యేకత అని మంత్రి అన్నారు. ఆ స్ఫూర్తి మరింత బలపడాలని ఆకాంక్షించారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి విద్య, ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో షాదీఖానాల నిర్మాణంతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు.
నల్లగొండ పట్టణంలో గత 30 ఏళ్లుగా ఎలాంటి మత ఘర్షణలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు సఖ్యతగా జీవిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ముస్లింల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని, ప్రజా ప్రభుత్వం అందరికీ సంక్షేమం అందిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఘర్షణలకు తావులేకుండా ఐక్యతగా జీవించాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ త్యాగం, సేవా మార్గాన్ని గుర్తు చేసే పండుగ బక్రీద్ అని పేర్కొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ కూడా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఏఎస్పీ రమేష్, డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ అమీర్, గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్ మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి