ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: ఎంపీడీవో శేషగిరి శర్మ
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: ఎంపీడీవో శేషగిరి శర్మ
స్థానికం బృందం
వేసవి నీటి సమస్యలపై ముందస్తు చర్యలు.. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సర్పంచులకు సూచనలు
మిర్యాలగూడ,
కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎంపీడీవో శేషగిరి శర్మ సూచించారు. రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గ్రామ పంచాయతీ నిధులతో పైపులైన్ మరమ్మతులు, గేట్ వాల్వ్ రిపేర్లు, ఓపెన్ ట్యాప్స్కు ఆన్–ఆఫ్ వ్యవస్థ బిగింపు, మోటార్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టాలని సూచించారు.
అవసరమైతే కొత్త మోటార్ల కొనుగోలు, అద్దె బోర్లు ఏర్పాటు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామపంచాయతీ భవనాలు, వివో భవనాలు, సిమెంట్ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, టాయిలెట్లు వంటి పనులను వెంటనే ప్రారంభించి మార్చి 31లోపు పూర్తి చేయాలని సూచించారు.
ఉగాది పండుగ నాటికి చివరి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి సామూహిక గృహప్రవేశాలు నిర్వహించేందుకు లబ్ధిదారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో శాతం వందకు పన్నులు వసూలు చేయాలని, వచ్చే సంవత్సరానికి పన్నుల డిమాండ్ సిద్ధం చేయాలని తెలిపారు.
అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్కు తరలించి సేంద్రియ ఎరువు తయారీ చేపట్టాలని సూచించారు. నర్సరీల్లో మంచి రకమైన నారు నాటించి జూన్లో జరిగే వనమహోత్సవానికి ఐదు నుంచి ఆరు అడుగుల మొక్కలను సిద్ధం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జి. వెంకట్ రెడ్డి, ఎంపీ ఓ రాఘవరావు, డివిజన్ పంచాయతీ అధికారి రాఘవరావు, ఎంపీ ఓ రమేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భవాని, పీఆర్ ఏఈ వరలక్ష్మి, మండల సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి