అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహణ
అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహణ
Biksham
సమాజ మార్పుకు మార్గదర్శి మహనీయుడు అంబేద్కర్
సూర్యాపేట: భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఇరుగు సంసోన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ దళితుల ఆరాధ్య దైవమని, సమాజంలో అంటరానితనం నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు.
డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించి, 1956 డిసెంబర్ 6న పరమపదించారు. ఆయన న్యాయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన శిల్పిగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా సేవలందించారని తెలిపారు. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యలు అభ్యసించి అరుదైన గౌరవాలు పొందిన అంబేద్కర్, దళితుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు నడిపారని గుర్తు చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని అన్నారు.
భారత ప్రభుత్వం 1990లో అంబేద్కర్కు మరణానంతరం భారత రత్న పురస్కారం ప్రదానం చేసిందని, ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి