డ్రగ్స్ నిర్మూలనపై అరవిందో జూనియర్ కళాశాలలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సెమినార్
విద్యార్థులు, యువత డ్రగ్స్, గంజాయి వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ మూడవ జిల్లా మహాసభల సందర్భంగా స్థానిక అరవిందో జూనియర్ కళాశాలలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... డివైఎఫ్ఐ యువజన సంఘం కేవలం పోరాటాలకే పరిమితం కాకుండా, సమాజ మార్పు కోసం, యువతకు అవగాహన కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలు, వాడకం కనిపిస్తే వెంటనే పోలీసు యంత్రాంగానికి సమాచారం అందించాలని కోరారు. అలాగే, నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిసలు కావద్దని, ఫోన్ల వినియోగం పెరుగుతుండటంతో సైబర్ క్రైమ్ కేసులు కూడా అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పరిశ్రమల్లో యువతకు ఉపాధి కల్పించాలి ప్రైవేటు విద్యాసంస్థల జిల్లా అధ్యక్షుడు బత్తుల శంకర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పల్లె మధుకృష్ణ మాట్లాడుతూ... డివైఎఫ్ఐ జిల్లా మూడో మహాసభలను ప్రధానంగా స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, కాలుష్యాన్ని అరికట్టడం వంటి ప్రధాన అజెండాతో నిర్వహిస్తున్నామని తెలిపారు. యువజన సమస్యలపై ప్రధానంగా చర్చించి, భవిష్యత్ పోరాట కార్యచరణను రూపొందిస్తామన్నారు. ఈ మహాసభకు జిల్లా వ్యాప్తంగా 300 మంది యువ ప్రతినిధులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ సెమినార్ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దుర్గయ్య, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ ఖయ్యూం, మండల కార్యదర్శి పల్లె శివకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తీగుళ్ల శ్రీనివాస్, నాయకులు జింకల మహేష్, అధ్యాపకుడు రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి