గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి.
ట్రాఫిక్కు ఆటంకం కలిగించొద్దు.. డీజేలపై నిబంధనలు పాటించాలి.
వలిగొండ, సెప్టెంబర్ 8: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని వలిగొండ ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటుకు ముందుగా పోలీస్, విద్యుత్, మున్సిపల్ లేదా గ్రామపంచాయతీ శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని కోరారు.
రహదారులకు అడ్డంగా మండపాలు వద్దు
వాహనాలు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయరాదని ఎస్ఐ తెలిపారు. అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
డీజేలపై నిబంధనలు.
ధ్వని కాలుష్యానికి కారణమయ్యే విధంగా మైకులు, డీజేలను వినియోగించరాదని సూచించారు. రాత్రి వేళల్లో నిర్దేశిత సమయం దాటిన తర్వాత శబ్ద పరికరాలను వినియోగించకూడదని, అమలులో ఉన్న నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మండపాల వద్ద సీసీ కెమెరాలు
ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రీకాంత్రెడ్డి సూచించారు. రాత్రి వేళల్లో మండపం వద్ద కనీసం ఇద్దరు లేదా ముగ్గురు నిర్వాహకులు ఉండి భద్రతను పర్యవేక్షించాలని తెలిపారు.
శోభాయాత్రలో అప్రమత్తంగా ఉండాలి.
నిమజ్జనం సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలో నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు. ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి