యువశక్తి శివమెత్తితే కుర్చీలు కూలిపోతాయి: కేటీఆర్.
యువశక్తి శివమెత్తితే కుర్చీలు కూలిపోతాయి: కేటీఆర్.
Editor Desk
రక్తపిశాచి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఒక లెక్క..
ఇకనుంచి మరో లెక్క
నెత్తురు సైరన్ మోగింది..
నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండ.
2028లో అధికారంలోకి వచ్చి ఉద్యోగాల బాధ్యత తీసుకుంటాం.
చైతన్యపురి,
గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) అన్నారు. యువతే దేశ భవిష్యత్తుకు దిక్సూచి అని పేర్కొంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేసిందని విమర్శించారు.
శనివారం సరూర్నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన **'యువ సంగ్రామ సదస్సు'**లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. 2022లో ఇదే వేదికపై యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదన్నారు. రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, మొత్తం 24 హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు.
యువతను మోసం చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు కాకుండా "లూటిఫికేషన్లు" మాత్రమే జరుగుతున్నాయని, కొలువుల కుంభమేళా పేరుతో నిరుద్యోగులను పోలీసులు కొడుతున్నారని విమర్శించారు. 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్ చూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు.
అసెంబ్లీలో తాను ప్రశ్నించగా ప్రభుత్వం కేవలం 16 వేల ఉద్యోగాలే ఇచ్చినట్లు చెప్పిందని గుర్తు చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులను "పెయిడ్ ఆర్టిస్టులు"గా అభివర్ణించడం, పోలీసు ఉద్యోగాలు కోరిన యువతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ చొరవతో 95 శాతం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానాన్ని అమలు చేశామని, పేపర్ లీకేజీ కేసుల్లో నిందితులను పట్టుకున్నదీ తామేనని తెలిపారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుని నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తానే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
జీవో నంబర్-46ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్, రాజీవ్ యువ వికాసం పేరుతో యువతను మోసం చేశారని, అయితే రేవంత్ రెడ్డి సోదరులకు మాత్రమే వికాసం కలిగిందని విమర్శించారు. తమ హయాంలో తీసుకొచ్చిన అమెజాన్, అమరరాజా వంటి సంస్థలకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో భూదందాలు, చందాల రాజకీయాలు నడుస్తున్నాయని, హైదరాబాద్లోని కంపెనీలు గుజరాత్కు తరలిపోతున్నా బీజేపీ స్పందించడం లేదన్నారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, ఒక అన్నగా యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతను తాను తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి