ప్రభుత్వ బడులే దేశానికి ఆదర్శం.. దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి మహ్మద్ అజహరుద్దీన్.
ప్రభుత్వ బడులే దేశానికి ఆదర్శం.. దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి మహ్మద్ అజహరుద్దీన్.
Editor Desk
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ను శనివారం సందర్శించిన ఆయన విద్యా, క్రీడా, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మమేకమై ప్లేగ్రౌండ్లో కాసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు, అత్యాధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, విశాలమైన క్రీడా మైదానాలు, బాస్కెట్బాల్, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడా సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు లభిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
"కష్టపడితేనే విజయం.. క్రమశిక్షణే విజయానికి పునాది" అని పేర్కొన్న మంత్రి..
ఉపాధ్యాయులను గౌరవించాలని, తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకోవాలని, ఓటమిని చూసి నిరాశ చెందకుండా లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని విద్యార్థులకు సూచించారు.
అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానం ద్వారా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో చదివి రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, మంచాల్ తహశీల్దార్, ఆరుట్ల సర్పంచ్ శోభారాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి