నకిలీ డి.ఏ.పీ దందా బట్టబయలు.500 బస్తాలు స్వాధీనం హైదరాబాద్ కేంద్రంగా తయారీ..
నకిలీ డి.ఏ.పీ దందా బట్టబయలు.500 బస్తాలు స్వాధీనం హైదరాబాద్ కేంద్రంగా తయారీ..
Komidala Mahender reddy
రైతులను మోసం చేస్తున్న ముఠాపై ఉక్కుపాదం.
హుజూర్నగర్, జూలై 18:
రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ ఎరువులను విక్రయిస్తూ భారీ మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టును వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. హుజూర్నగర్ వ్యవసాయ శాఖ పరిధిలో సుమారు 500 బస్తాల నకిలీ డి.ఏ.పీ ఎరువులను స్వాధీనం చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది.
హుజూర్నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రవి తెలిపిన వివరాల ప్రకారం, మూడు రోజుల క్రితం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మట్టంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్స్ లేకుండా కొందరు డీలర్లు రైతులకు డి.ఏ.పీ పేరుతో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ సుమారు 100 బస్తాల నకిలీ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో ఇదే ముఠా మేళ్లచెరువు మండలంలో మరో 400 బస్తాల నకిలీ ఎరువులను విక్రయించినట్లు తేలింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
హైదరాబాద్లో తయారీ కేంద్రం..
దర్యాప్తులో ఈ నకిలీ ఎరువుల తయారీ వెనుక హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అక్రమ యూనిట్ ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. గత మూడు రోజులుగా వ్యవసాయ శాఖ, పోలీసు అధికారులు సంయుక్తంగా అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న ఎరువుల నమూనాలను ప్రయోగశాలకు పంపగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. అసలైన డి.ఏ.పీలో ఉండాల్సిన భాస్వరం పూర్తిగా లేకపోగా, నత్రజని కేవలం 1 శాతం మాత్రమే ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది.
రైతులకు రెట్టింపు నష్టం
ఇలాంటి నకిలీ ఎరువుల వాడకం వల్ల రైతులు కొనుగోలు చేసిన డబ్బు వృథా కావడమే కాకుండా, పంటలకు అవసరమైన పోషకాలు అందక దిగుబడులు తీవ్రంగా దెబ్బతింటాయని అధికారులు హెచ్చరించారు.
ఫలితంగా రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
అనధికార డీలర్ల వద్ద కొనొద్దు
లైసెన్స్ కలిగిన ఎరువుల దుకాణాల నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని, అనుమానాస్పదంగా ఎవరైనా నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు తెలిసినా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని హుజూర్నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రవి సూచించారు. నకిలీ ఎరువుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నకిలీ ఎరువుల మాఫియాపై అధికారుల ఉక్కుపాదంతో రైతుల్లో కొంత ఊరట కనిపిస్తున్నా, ఇప్పటికే ఎంతమంది రైతులు ఈ మోసానికి బలయ్యారన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి