దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్న కేంద్ర ఆర్థిక విధానాలు దొడ్డి దారిన మూడు నల్ల చట్టాలను మళ్లీ తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది:
దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్న కేంద్ర ఆర్థిక విధానాలు దొడ్డి దారిన మూడు నల్ల చట్టాలను మళ్లీ తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది:
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్
నవంబర్ 18 నుంచి 21 వరకు నల్లగొండలో అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగానే దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ ఆరోపించారు. 2020లో రైతుల ఉద్యమంతో వెనక్కి తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాలను బీహార్ ఎన్నికల తర్వాత మళ్లీ దొడ్డి దారిన అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్లో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన, అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలాస, విజయవాడ, ఖమ్మం, గుంటూరులో కిసాన్ సభ మహాసభలు నిర్వహించామని, ఈసారి 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభలను నవంబర్ 18, 19, 20, 21 తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో వ్యవసాయ సంక్షోభం మరింత తీవ్రమైందని, రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు, ఆదివాసీ రైతులు, మహిళా రైతులు కలిపి లక్షలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అప్పుల భారం, ఆర్థిక సరళీకరణ విధానాల ప్రభావంతో గత 12 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. అనేక రాష్ట్రాలు రైతుల ఆత్మహత్యల అసలు గణాంకాలను వెల్లడించడం లేదని కూడా విమర్శించారు.
2020లో కరోనా లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని, అయితే ఢిల్లీలో ఏడాదికిపైగా సాగిన రైతుల ఉద్యమం ఫలితంగానే వాటిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు అదే చట్టాలను మరో రూపంలో అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జూలై 29న ఢిల్లీలో సంయుక్త కిసాన్ సభ, ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఆగస్టు 10న దేశవ్యాప్తంగా కార్మిక–కర్షక ఐక్యతతో పది లక్షల మందితో'జైల్ భరో' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమంలో 736 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్న విజ్జు కృష్ణన్, అమెరికా, న్యూజిలాండ్, యూరోపియన్ దేశాల నుంచి పత్తి, సోయాబీన్, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు తగ్గించడం వల్ల దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. న్యూజిలాండ్ నుంచి తక్కువ ధరకు పాల దిగుమతులు జరిగితే భారత పాల ఉత్పత్తిదారుల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిందని, అలాంటి పోరాటాల గడ్డ అయిన నల్లగొండలో కిసాన్ సభ జాతీయ మహాసభలు నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా సుమారు 800 మంది ప్రతినిధులు హాజరవుతారని, రైతులు, ప్రజాసంఘాలు, ప్రజలు మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి