100 పడకల ఆసుపత్రి పనులను వెంటనే పూర్తి చేయాలి
100 పడకల ఆసుపత్రి పనులను వెంటనే పూర్తి చేయాలి
K.RAVI
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి
నత్తనడకన నిర్మాణ పనులు.. ప్రజలకు తప్పని ఇబ్బందులు
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి పనులను వెంటనే పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం చౌటుప్పల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి, అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రి నిర్మాణం సంవత్సరాలు గడుస్తున్నా నత్తనడకన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. చౌటుప్పల్ ప్రాంతం ఆరు మండలాలకు కేంద్రంగా ఉండటంతో పాటు జాతీయ రహదారిపై ఉన్నందున ప్రతిరోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అత్యవసర వైద్య సేవలు అందించడానికి 100 పడకల ఆసుపత్రి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రమాద బాధితులు, పేద ప్రజలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు లేదా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందన్నారు. అక్కడ లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అవసరమైన వైద్య పరికరాలు, వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి