తహసీల్దార్ సంతోష్ రెడ్డి సస్పెండ్. అసైన్మెంట్ భూముల అక్రమాలపై కలెక్టర్ ఉక్కుపాదం.
తహసీల్దార్ సంతోష్ రెడ్డి సస్పెండ్. అసైన్మెంట్ భూముల అక్రమాలపై కలెక్టర్ ఉక్కుపాదం.
Editor Desk
ఉదయం తనిఖీ... సాయంత్రానికే వేటు.
విచారణలో అక్రమాలు వెలుగులోకి రావడంతో కఠిన చర్య.
అసైన్మెంట్ భూముల అక్రమాలపై నిజామాబాద్ జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. నిబంధనలకు విరుద్ధంగా అసైన్మెంట్ భూముల వ్యవహారాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నందిపేట్ తహసీల్దార్ సంతోష్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా నిర్వహించిన విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో అసైన్మెంట్ భూముల ఆస్తి బదిలీ దరఖాస్తులను నిబంధనలకు విరుద్ధంగా పరిష్కరించడం, లబ్ధిదారులతో కుమ్మక్కై పట్టాలు జారీ చేశారంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. దీంతో సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్కు సమర్పించిన నివేదికలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో తహసీల్దార్పై సస్పెన్షన్ వేటు పడింది.
ఉదయం తనిఖీ... సాయంత్రానికే సస్పెన్షన్
గురువారం ఉదయం నందిపేట్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులను పరిశీలించి పలు లోపాలను గుర్తించిన ఆమె, తహసీల్దార్తో పాటు సిబ్బంది పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ, అసైన్మెంట్ భూములను అక్రమాల నుంచి కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని స్పష్టం చేస్తూ, విధుల్లో నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రెవెన్యూ వర్గాల్లో కలకలం
ఉదయం తనిఖీ నిర్వహించి హెచ్చరికలు జారీ చేసిన జిల్లా కలెక్టర్, అదే రోజు సాయంత్రానికే తహసీల్దార్ను సస్పెండ్ చేయడం జిల్లా రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చర్యతో అసైన్మెంట్ భూముల వ్యవహారాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికారులపై ప్రభుత్వం రాజీ పడబోదన్న స్పష్టమైన సంకేతాలు వెళ్లాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అసైన్మెంట్ భూముల లావాదేవీలపై ఇక మరింత నిఘా పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి