ఉద్యమకారులకు కేకే కమిటీ పిలుపు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలి: జోగు అంజన్న
ఉద్యమకారులకు కేకే కమిటీ పిలుపు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలి: జోగు అంజన్న
Editor Desk
నల్గొండ, జూలై 16: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు న్యాయం జరిగే దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ సమావేశాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలు, సూచనలు, వినతిపత్రాలు సమర్పించాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పిలుపునిచ్చారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని, వారి హక్కుల సాధన కోసం ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో గత తొమ్మిదేళ్లుగా నిరంతర పోరాటం కొనసాగించామని తెలిపారు. ఆ పోరాటానికి హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కేకే కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.
తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, జైలు జీవితం అనుభవించిన వారు, వికలాంగులైన వారు, అరెస్టులు, బైండోవర్లు ఎదుర్కొన్న తొలి, మలి దశ ఉద్యమకారులందరికీ న్యాయం చేయడమే కమిటీ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్లోని సచివాలయం ఎదురుగా ట్యాంక్బండ్ వద్ద అమరవీరుల జ్యోతి వేదికగా సమావేశాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా జూలై 17న ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉద్యమకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు, ఉద్యమకారిణులు ఈ సమావేశానికి హాజరై తమ అర్హతలకు సంబంధించిన వినతిపత్రాలను కేకే కమిటీకి సమర్పించాలని కోరారు.
ప్రతి అర్హత కలిగిన ఉద్యమకారుడికి న్యాయం జరిగే వరకు ఉద్యమకారుల ఫోరం అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తుందని జోగు అంజన్న ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి