జోరు వానలో మూసి బ్రిడ్జికి శ్రీకారం.. భీమలింగం సాక్షిగా రూ.50 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
జోరు వానలో మూసి బ్రిడ్జికి శ్రీకారం.. భీమలింగం సాక్షిగా రూ.50 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
Komidala Mahender reddy
జోరువానను సైతం లెక్కచేయకుండా భీమలింగం క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సంగెం–బోలేపల్లి మధ్య మూసి నదిపై నిర్మించనున్న నూతన వంతెన పనులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ఆయన, ఈ వంతెన నిర్మాణంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సంగెం–బోలేపల్లి మధ్య మూసి నదిపై సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు ప్రస్తుతం భూమి చదును చేసే కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అధికారిక శంకుస్థాపన నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇన్ని రోజులు వర్షాలు లేకపోయినా, ఈరోజు భీమలింగేశ్వరుని సన్నిధికి రాగానే వర్షం కురవడం శుభసూచకం” అని అన్నారు. అనంతరం భీమలింగం కట్టవ వద్ద శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు.
మూసి పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకే ఈ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే మూసి ప్రక్షాళన కార్యక్రమాన్ని సీఎం ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
భీమలింగం దేవాలయ అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఈ క్షేత్రం రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూసి రివర్ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భీమలింగం ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
మూసి ప్రక్షాళన కార్యక్రమంపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేయకుండా, చిన్న చిన్న లోపాలను గోరంతను కొండంతలు చేయవద్దని సూచించారు. ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి