అధికారుల అండతో కాంగ్రెస్ నాయకుల భూదౌర్జన్యాలు...
అధికారుల అండతో కాంగ్రెస్ నాయకుల భూదౌర్జన్యాలు...
NM Yadav
ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి...
చెన్నుగూడెం బాధితులతో కలిసి వినతిపత్రం అందజేత...
పద్ధతి మార్చుకోకుంటే తిరగబడతామని హెచ్చరిక...
నల్గొండ : నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అధికార దాహం, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్గొండ మండలం చెన్నుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ బాధితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారనే వ్యవహారంపై శుక్రవారం ఆయన స్పందించారు. నల్గొండ జిల్లా ఎస్పీని ఆయన కార్యాలయంలో కలిసి, బాధిత రైతులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.
రైతులకు తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం కార్యాలయం వెలుపల కంచర్ల భూపాల్రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికార బలంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ నాయకులు అధికారులను, మరీ ముఖ్యంగా పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని బరితెగిస్తున్నారని ఆరోపించారు. చెన్నుగూడెంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పేద రైతుల భూములపై పడుతున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. అధికార పార్టీ నాయకుల భూదౌర్జన్యాలు ఇలాగే సాగితే చూస్తూ ఊరుకోం. బాధితుల పక్షాన నిలిచి తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఇప్పటికైనా అధికారులు తమ పద్ధతి మార్చుకుని నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మున్సిపల్ కార్పొరేటర్ మారగోని గణేష్, నల్గొండ, తిప్పర్తి మండలాల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, చెన్నుగూడెం మాజీ సర్పంచ్ గుండెబోయిన జంగయ్యతో పాటు బాధిత రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి