కంటి చూపు కోసం వెళ్తే.. చీకట్లు మిగిలాయా?
కంటి చూపు కోసం వెళ్తే.. చీకట్లు మిగిలాయా?
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపై రోగి కుటుంబం ఆవేదన – ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్
కంటి చూపు మెరుగుపడుతుందనే ఆశతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఓ వృద్ధ మహిళ, చికిత్స అనంతరం కంటిచూపు మరింత దెబ్బతిన్నట్లు ఆరోపిస్తూ కన్నీరుమున్నీరవుతోంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన గొల్లోజు రాములమ్మకు నల్లగొండ గొల్లగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన చికిత్సపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారుల జోక్యాన్ని కోరుతున్నారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, కంటికి మసకగా కనిపిస్తోందని రాములమ్మ ఈ నెల 8న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు కంటి శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం వారం రోజుల తర్వాత పరీక్షల కోసం రావాలని సూచించారు. సూచన మేరకు తిరిగి ఆసుపత్రికి వెళ్లిన రాములమ్మకు కంటిలో బుడగ (బ్లిస్టర్) ఏర్పడిందని వైద్యులు తెలిపి మళ్లీ కుట్లు వేసి మరోసారి శస్త్రచికిత్స చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అనంతరం మరో వారం రోజులు తర్వాత రావాలని సూచించారని, అయితే కుట్లు వేసినప్పటి నుంచి కంటిలో తీవ్రమైన మంట, నొప్పి, అసౌకర్యం ఉందని పలుమార్లు వైద్యులకు తెలిపినా, "శస్త్రచికిత్స తర్వాత ఇలాంటి నొప్పులు సహజమే" అంటూ ఇంటికి పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గతంలో కొంత మసకగా కనిపించిన కన్ను, ఇప్పుడు పూర్తిగా చూపు కోల్పోయే పరిస్థితికి చేరుకుందని రాములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ కంటితో ఏమీ కనిపించడం లేదని, తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదిలా ఉండగా, ఇటీవలే జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగుల పట్ల వైద్యులు మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రోగి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, చికిత్సలో ఏవైనా నిర్లక్ష్యం జరిగి ఉంటే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. అలాగే రాములమ్మకు మెరుగైన వైద్యం అందించి కంటి చూపును కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి