విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఎంతో అవసరం.జనంపల్లి జెడ్పీహెచ్ఎస్లో న్యాయ సేవల సంస్థ ప్రత్యేక సదస్సు
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఎంతో అవసరం.జనంపల్లి జెడ్పీహెచ్ఎస్లో న్యాయ సేవల సంస్థ ప్రత్యేక సదస్సు
Editor Desk
రామన్నపేట, విద్యార్థులు విద్యతో పాటు చట్టాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలని రామన్నపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష సూచించారు. మండలంలోని జనంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామన్నపేట మండల న్యాయ సేవల అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి ఎస్. శిరీష మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ ద్వారానే ప్రపంచాన్ని మార్చే అవకాశం ఉంటుందని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.
విద్యా హక్కు చట్టం, బాలకార్మిక నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టం, కార్మిక చట్టాలు, మాదకద్రవ్యాల నివారణ వంటి అంశాలపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. పాఠశాలలో లేదా పాఠశాలకు వచ్చే, వెళ్లే మార్గంలో ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే పాఠశాలలోని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్కు, స్థానిక పోలీసులకు లేదా మండల న్యాయ సేవల అధికార సంస్థకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
విద్యార్థులు చెడు ఆలోచనలకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి సారించాలని, మంచి నిర్ణయాలు తీసుకునేలా తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని అన్నారు. సమాజం పట్ల అవగాహన పెంచుకుని హక్కులు, బాధ్యతలను తెలుసుకుంటూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో అడ్వకేట్లు బర్ల డేవిడ్, మామిడి వెంకట్రెడ్డి, ఎన్. రమేష్, ప్రధానోపాధ్యాయురాలు కె. విజయమాధవి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మట్టారెడ్డి, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి