“గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలకే వేధింపులా” – పార్టీలో అసంతృప్తి సంకేతాలు
“గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలకే వేధింపులా” – పార్టీలో అసంతృప్తి సంకేతాలు
Komidala Mahender reddy
బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
నల్గొండ జిల్లా:
రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. నకిరేకల్, తుంగతుర్తి వంటి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష సంబంధం లేని అభ్యర్థులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చినా, కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో సొంత డబ్బులు ఖర్చు చేసి వారిని గెలిపించారని పేర్కొన్నారు.అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత అదే నాయకులు అసలు కాంగ్రెస్ కార్యకర్తలపైనే కేసులు పెట్టిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గౌరవం, ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి క్షేత్రస్థాయిలో పెరుగుతోందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్లోని వర్గపోరును మరోసారి వెలుగులోకి తెచ్చినట్లయ్యాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి చేరిన నేతలకు ప్రాధాన్యం పెరుగుతుండగా, ఎన్నాళ్లుగానో పార్టీ జెండా మోసిన కార్యకర్తల్లో అసహనం పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రానున్న రోజుల్లో ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీలో అంతర్గత విభేదాలకు ఈ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి