వారం రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలి..అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశం..
వారం రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలి..అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశం..
NM Yadav
ఎండకాలం దృష్ట్యా కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి..
పట్టణ రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..
నల్గొండ : జిల్లాలో రబీ ధాన్యం సేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, రానున్న వారం పది రోజుల్లోనే ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం ఇందిరా భవన్లో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్తో కలిసి పౌరసరఫరాలు, మార్కెటింగ్, రవాణా, కో-ఆపరేటివ్ తదితర శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వంటి వసతులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. గడువులోగా సేకరణ పూర్తి చేసేందుకు అవసరమైతే రాత్రి వేళల్లోనూ లైట్లు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నల్గొండ నియోజకవర్గంలోనే సుమారు 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఇక్కడ ప్రతిరోజూ 10 వేల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. హమాలీల కొరత లేకుండా చూడాలని లారీల సంఖ్యను పెంచి సేకరించిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం దిగుమతిలో రైస్ మిల్లర్లు జాప్యం చేయకుండా సహకరించాలని కోరిన మంత్రి.. కనగల్, ధర్వేశిపురం వంటి ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ గోదాములను ధాన్యం నిల్వకు వినియోగించుకోవాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఇంకా 10 శాతం మేర కోతలు పెండింగ్లో ఉన్నాయని రైతులు ధాన్యాన్ని రోడ్లపై పోయకుండా అవసరమైతే పాఠశాల భవనాలు, ఫంక్షన్ హాళ్లను కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని సూచించారు.
నల్గొండను సుందరంగా తీర్చిదిద్దుతాం..
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిపై తనకున్న దార్శనికతను పంచుకున్నారు. రహదారులు, భవనాల శాఖ ద్వారా జిల్లాలోని ప్రధాన రహదారులన్నింటినీ అభివృద్ధి చేస్తున్నామని ఔటర్ రింగ్ రోడ్డు పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ తరహాలో నల్గొండ పట్టణం చుట్టూ రోడ్లను ఏర్పాటు చేసి, ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్ల పనులను పూర్తి చేస్తామన్నారు. పట్టణంలోని పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా వార్డుల వారీగా కృష్ణా జలాలను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ కలెక్టర్ జె.శ్రీనివాస్, అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, పౌర సరఫరాల అధికారి వెంకటేశం, ఏడీ ఛాయాదేవి, డీసీఓ పత్యా నాయక్, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి