పెద్దకాపర్తిలో రైతులకు CRIDA శాస్త్రవేత్తల అవగాహన
పెద్దకాపర్తిలో రైతులకు CRIDA శాస్త్రవేత్తల అవగాహన
Komidala Mahender reddy
భూసార పరిరక్షణకు సమతుల్య ఎరువులు, పంట మార్పిడి అవసరం
రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలని సూచన
చిట్యాల, జూలై 1:
హైదరాబాద్కు చెందిన మెట్ట పరిశోధన సంస్థ (CRIDA) శాస్త్రవేత్తలు బుధవారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో రైతులకు భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “కేత్ బచావో అభియాన్” మరియు “మేరా గావ్ మేరా గౌరవ్” కార్యక్రమాల కింద జరిగిన ఈ సమావేశంలో రైతులకు వ్యవసాయ భూముల సంరక్షణపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్ గోష్, డాక్టర్ రవికాంత్, మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు మాట్లాడుతూ రైతులు అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు సారవంతమైన నేలను అందించాలంటే సమతుల్య ఎరువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు.
పెంట ఎరువు, పచ్చిరొట్టె ఎరువులు వంటి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, భూసారాన్ని హరించే పత్తి వంటి పంటల సాగును తగ్గించి కంది, పెసర, మినుము వంటి పప్పుధాన్యాలతో పంట మార్పిడి చేపట్టాలని రైతులకు సూచించారు.
నేలల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నందున డీఏపీ వంటి ఎరువుల వినియోగాన్ని తగ్గించి, భాస్వరాన్ని కరిగించే పాస్ఫో బ్యాక్టీరియాను పొలాల్లో వినియోగించాలని తెలిపారు. అలాగే నానో యూరియా, నానో డీఏపీ ఎరువులు సంప్రదాయ రసాయన ఎరువులకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాలని వివరించారు.
కార్యక్రమంలో పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకన్న, ఏఈఓ శిల్పతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతులు శాస్త్రవేత్తలను వివిధ వ్యవసాయ సమస్యలపై ప్రశ్నించి సలహాలు తీసుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి