ఐఐసీటీలో పరిశోధనలకు కొత్త ఊపు. నాలుగు అత్యాధునిక రీసెర్చ్ కేంద్రాల ప్రారంభం..
ఐఐసీటీలో పరిశోధనలకు కొత్త ఊపు. నాలుగు అత్యాధునిక రీసెర్చ్ కేంద్రాల ప్రారంభం..
Editor Desk
200 మంది సామర్థ్యంతో హాస్టల్కు శంకుస్థాపన.
శాస్త్రీయ ఆవిష్కరణలతోనే ‘వికసిత్ భారత్’ సాధ్యం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.
హైదరాబాద్,
దేశంలో శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు మరింత ఊతమిచ్చేలా హైదరాబాద్లోని సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో నాలుగు అత్యాధునిక పరిశోధన కేంద్రాలను కేంద్ర శాస్త్ర, సాంకేతికత, భూ విజ్ఞాన శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మంగళవారం ప్రారంభించారు. అదే సమయంలో 200 మంది విద్యార్థులు ఉండగలిగే ఆధునిక హాస్టల్ భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు.
ఫ్లోరో కెమికల్స్ కోసం అధునాతన ఆర్అండ్డీ కేంద్రం, వస్త్ర పరిశ్రమ వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం, కంటిన్యూయస్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ ఫెసిలిటీ, సస్టెయినబుల్ ఇంజినీరింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించిన జితేంద్ర సింగ్.. శాస్త్రీయ పరిశోధనలే దేశ ఆర్థికాభివృద్ధికి, సాంకేతిక స్వావలంబనకు బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. జాతీయ అవసరాలకు అనుగుణంగా, పరిశ్రమలకు ఉపయోగపడే పరిశోధనలపై శాస్త్రవేత్తలు మరింత దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
పరిశోధన ఫలితాలను పరిశ్రమలకు చేరవేయడం, అంకుర సంస్థలకు ప్రోత్సాహం, మేధో హక్కుల పరిరక్షణ, సాంకేతిక బదిలీ వంటి అంశాల్లో ఐఐసీటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
సీఎస్ఐఆర్–ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. కొత్త పరిశోధనా సౌకర్యాలు సంస్థ పరిశోధనా సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తాయని తెలిపారు. పరిశ్రమలు, వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ రంగాలకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
కొత్తగా నిర్మించనున్న హాస్టల్ ద్వారా పరిశోధకులు, విద్యార్థులకు అత్యాధునిక వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి