ఎన్నారం రైతులకు షాక్.. ధాన్యం కొనుగోళ్లలో 48 బస్తాలు గల్లంతు!
ఎన్నారం రైతులకు షాక్.. ధాన్యం కొనుగోళ్లలో 48 బస్తాలు గల్లంతు!
Editor Desk
ధాన్యం కొనుగోళ్లలో భారీ గోల్మాల్.. 48 బస్తాలు మాయం!
యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో లెక్కించిన ధాన్యం బస్తాలు మిల్లుకు చేరేసరికి 48 బస్తాలు మాయమైన ఘటన రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన రైతు ఏనుగు దామోదర్ రెడ్డితో పాటు మరికొందరు రైతులు తాము పండించిన రబీ వరి ధాన్యాన్ని స్థానిక పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. అక్కడ అధికారులు ఒక్కో బస్తాకు 42 కిలోల చొప్పున మొత్తం 953 బస్తాలుగా లెక్కగట్టి లారీలో లోడ్ చేసి హనుమకొండ జిల్లాలోని ఓ రైస్ మిల్లుకు తరలించారు.
అయితే మిల్లులో అన్లోడ్ చేసిన అనంతరం కేవలం 905 బస్తాలు మాత్రమే వచ్చినట్లు ట్రక్ షీట్లో నమోదు చేశారు. తూకం వేయగా మొత్తం 37,870 కిలోల ధాన్యం మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో కొనుగోలు కేంద్రంలో లోడ్ చేసిన 953 బస్తాల్లో 48 బస్తాలు మాయమైనట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యమా, రవాణా చేసిన లారీ డ్రైవర్ చేతివాటమా, లేక మిల్లు యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు రైతుల విషయంలోనే ఇంత పెద్ద ఎత్తున బస్తాలు మాయమైతే, మండల వ్యాప్తంగా మరెంతమంది రైతులు నష్టపోయి ఉంటారోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై స్థానిక అధికారులను ఆశ్రయించినప్పటికీ సరైన స్పందన లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రవాణా రికార్డులు, ట్రక్ రూట్ మ్యాప్, సంబంధిత పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి, మాయమైన ధాన్యం బస్తాలకు నష్టపరిహారం అందించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నారం గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి