ఆత్మసాక్షాత్కార మహోత్సవం.. రమణేశ్వరంలో ఆధ్యాత్మిక వైభవం
ఆత్మసాక్షాత్కార మహోత్సవం.. రమణేశ్వరంలో ఆధ్యాత్మిక వైభవం
Komidala Mahender reddy
సిద్ధగురు రమణానంద మహర్షి 31వ ఆత్మసాక్షాత్కార దినోత్సవ వేడుకలకు భక్తుల పోటెత్తిన జనసంద్రం
ఆధ్యాత్మిక చైతన్యానికి నిలయంగా పేరుగాంచిన భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని రమణేశ్వరం ఆదివారం భక్తిజన సంద్రంగా మారింది. జగద్గురు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి 31వ ఆత్మసాక్షాత్కార మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా నిర్వహించబడ్డాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.
ఉదయం నుంచే రమణేశ్వరం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సిద్ధగురు ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఏకాగ్రతతో ధ్యానసాధన నిర్వహించగా, అనంతరం శ్రీచక్ర మహాలయంలో ప్రత్యేక పూజలు, బంగారు శివలింగానికి మహాభిషేకం, హోమహవనాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమాల అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
‘ఆత్మదర్శనం అరుదైన దివ్యానుభూతి’
ఈ సందర్భంగా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ప్రసంగిస్తూ ఆత్మసాక్షాత్కారం యొక్క పరమార్థాన్ని వివరించారు. 1995 జూన్ 29న మాత పూర్ణానంద యోగిని వారి అనుగ్రహంతో శక్తిపాతం ద్వారా తనకు ఆత్మదర్శనం కలిగిందని, ఆ దివ్య అనుభూతి జీవితానికి దిశానిర్దేశం చేసిందని తెలిపారు.
ఆత్మదర్శనం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, జీవభావం వంటి అన్ని పరిమితులను అధిగమించి, సంకల్ప–వికల్పాలకు అతీతమైన దివ్య ప్రజ్ఞా స్థితిని అనుభవించడమని పేర్కొన్నారు. అలాంటి స్థితిని కోట్లలో ఒకరు మాత్రమే పొందగలరని వ్యాఖ్యానించారు.
గురుకృపతోనే ఆత్మసాక్షాత్కారం
కేవలం శాస్త్రాలు, వేదాలు అధ్యయనం చేయడం ద్వారా భాషా, బుద్ధిజ్ఞానం మాత్రమే లభిస్తుందని, నిజమైన ఆత్మసాక్షాత్కారం కోసం సద్గురువును ఆశ్రయించి గురుసేవ చేయాల్సిన అవసరం ఉందని సిద్ధగురు తెలిపారు. గురుకృపతోనే ఆధ్యాత్మిక సాధన పరిపక్వమై ఆత్మదర్శనం సిద్ధిస్తుందని భక్తులకు సందేశమిచ్చారు.
ఈ మహోత్సవంలో పండిత్ గోపదేవ గారి ప్రముఖ శిష్యుడు శ్రీ మసన చెన్నప్పతో పాటు పలువురు ఆధ్యాత్మిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ధ్యానం, గురుభక్తి, వైదిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక సందేశాల సమ్మేళనంగా సాగిన ఈ వేడుక భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కార్యక్రమం ముగిసే వేళ సిద్ధగురు ఆశీస్సులు పొందిన భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి