రైతుల అభ్యున్నతికి పీఏసీఎస్ల ద్వారా నిరంతర కృషి: గొంగిడి మహేందర్ రెడ్డి
రైతుల అభ్యున్నతికి పీఏసీఎస్ల ద్వారా నిరంతర కృషి: గొంగిడి మహేందర్ రెడ్డి
Editor Desk
యాదగిరిగుట్ట, జూలై 1: రైతుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) నిరంతరం కృషి చేస్తున్నాయని ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట పీఏసీఎస్ ఆవరణలో ఏర్పాటు చేసిన పశువుల దాణా కొనుగోలు కేంద్రం (ఫీడ్ బజార్)ను పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశువుల పాల ఉత్పత్తి పెరిగేందుకు నాణ్యమైన పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఫీడ్ బజార్ను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులకు సకాలంలో రుణాలు, విత్తనాలు అందించేందుకు పీఏసీఎస్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని, యాదగిరిగుట్ట పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. గతంలో వెనుకబాటులో ఉన్న యాదగిరిగుట్ట పీఏసీఎస్ను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చి, రైతులకు పెద్ద ఎత్తున రుణాలు అందించి ఆర్థికంగా బలోపేతం చేసినట్లు తెలిపారు.
పీఏసీఎస్ను మరింత బలోపేతం చేసేందుకు రైతులు సభ్యత్వం తీసుకుని సహకరించాలని కోరారు. రైతులకు అందాల్సిన పెండింగ్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
యూరియా, విత్తనాల బుకింగ్లో యాప్ విధానం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ విధానాన్ని తొలగించి నేరుగా రైతులకు ఎరువులు, విత్తనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఫీడ్ బజార్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల పశువుల దాణాను రైతులకు పరిచయం చేశారు. 50 కిలోల బస్తాల్లో నాణ్యమైన పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు, పీఏసీఎస్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి